బంగ్లాదేశ్ లో హిందువులపై హింస ఏ మాత్రం తగ్గడం లేదు. వరుసగా అయిదవ రోజు కూడా హిందువుల మీద.. ఆలయాల మీద దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. హిందువుల ఇళ్లను కూడా తగులబెట్టేస్తున్నారు. మైనారిటీ హిందూ సమాజంపై వరుసగా 5 రోజులు హింసను కొనసాగించారు. ఆదివారం (అక్టోబర్ 17) నాడు బంగ్లాదేశ్లోని రంగ్పూర్ డివిజన్లోని పిర్గంజ్ ఉపజిల్లాలోని 20 హిందూ గృహాలను తగలబెట్టారు. బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ (BHUC) ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలియజేసింది. “రంగ్పూర్ పిర్గంజ్లో హిందువులపై దాడి జరిగింది. దేశవ్యాప్తంగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్లో హిందువులు మనుగడ సాగించడం కష్టమవుతుంది” అంటూ ట్వీట్ చేసింది. హిందువుల ఇళ్ళు తగులబడుతున్న ఫోటోలను కూడా ట్వీట్ చేశారు.
బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ షేర్ చేసిన వీడియో ఫుటేజ్లో ఒక దేవాలయాన్ని ఇస్లామిస్ట్ గుంపు కాల్చివేస్తుండడం చూడవచ్చు. అగ్నిమాపక సిబ్బంది దానిని ఆర్పడానికి ప్రయత్నించింది. దేవాలయ ప్రాంగణంలో ఉంచిన విగ్రహాలు కూడా మంటల్లో కాలిపోయాయి. ప్రస్తుతం రంగ్పూర్లో పరిస్థితి విషమంగా ఉంది. హిందువుల ఇళ్లు, దేవాలయాలు దగ్ధమయ్యాయి. రంగ్పూర్ జిల్లాలోని పిర్గంజ్ ఉపజిల్లాలోని ఒక హిందూ గ్రామానికి ముస్లిం సమూహం నిప్పు పెట్టిందని పలువురు తెలియజేశారు.
నౌఖాలీ జిల్లాలో ఇస్కాన్ దేవాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసానికి దిగారు. భక్తులపైనా దాడి చేశారు. గాయపడిన భక్తుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దసరా సందర్భంగా ఇస్కాన్ ఆలయం, భక్తులపై 200 మందికి పైగా దుండగులు దాడి చేశారు. హింసాత్మక దాడిలో 3 మంది భక్తులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. 144 సెక్షన్ విధించిన చౌముహాని ప్రాంతంలో శుక్రవారం నాడు ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిని శిక్షిస్తామని హామీ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది. గురువారం నాడు దుర్గా పూజ వేడుకల సందర్భంగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో ముగ్గురు మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారు.
తమ దేశం ఇస్లాం దేశం కాదు.. సెక్కులర్ దేశం:
బంగ్లాదేశ్ దేశ పితామహుడు, బంగబంధు షేక్ ముజీబుర్ రహమాన్ ప్రతిపాదించిన 1972 రాజ్యాంగం ప్రకారం బంగ్లాదేశ్ ఒక లౌకిక దేశం అని బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి మురాద్ హసన్ పేర్కొన్నారు. తమ దేశం ఇస్లాం దేశం కాదని.. ఒక సెక్కులర్ దేశమని అన్నారు. బంగ్లాదేశ్ మత ఛాందసవాదులకు స్వర్గధామం కాదుని అన్నారు. ‘మా శరీరంలో స్వాతంత్ర్య సమరయోధుల రక్తం ఉంది. 72లో తీసుకుని వచ్చిన రాజ్యాంగం గురించి మనం ఆలోచించాలి. ఈ విషయంపై నేను పార్లమెంటులో మాట్లాడతాను. ఎవరూ మాట్లాడకపోయినా నేను నా స్వరాన్ని వినిపిస్తాను’ అని మురాద్ హసన్ వ్యాఖ్యలు చేశారు. హింసకు పాల్పడుతున్న వాళ్లను తప్పకుండా శిక్షిస్తామని ఆయన తెలిపారు. మతం పేరుతో తమ దేశాన్ని విడగొట్టడాన్ని సహించమని ఆయన తెలిపారు. మాజీ సైనిక పాలకులు హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్, జియౌర్ రహమాన్ ఇస్లాంను అధికారిక మతంగా రాజ్యాంగంలో విలీనం చేసినందుకు తప్పుబట్టారు. హింసను ప్రేరేపించడానికి మరియు మతం పేరుతో దేశాన్ని విభజించుతున్న బిఎన్పి-జమాత్ పై విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ ఒక సెక్కులర్ దేశమని.. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ తమ మతాలను ఆరాధించవచ్చని పిలుపును ఇచ్చారు.