రాజీవ్ హత్య కేసు దోషుల విడుదలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ అధికారం తమకు లేదని పేర్కొంటూ ఇద్దరి పిటిషన్లను తిరస్కరించింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న దోషులైన నళిని శ్రీహరన్, రవిచంద్రన్ తమ విడుదల కోసం తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోని ఏడుగురు నిందితుల విడుదలను 2018 సెప్టెంబర్లో గత ఏఐఏడీఎంకే కేబినెట్ ఆమోదించినట్లు పిటిషన్లో తెలిపారు. అయితే ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదించలేదని చెప్పారు. ఈ కేసులో మరో దోషి అయిన ఏజీ పేరారివాలన్ విడుదలకు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అంగీకారంతో సంబంధం లేకుండా తమ విడుదలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.
కాగా, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ భండారీ, జస్టిస్ ఎన్ మాలతో కూడిన తొలి ధర్మాసనం… నళిని, రవిచంద్రన్ పిటిషన్లపై విచారణ జరిపింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులకు అలాంటి అధికారం లేదని తెలిపింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు అలాంటి ప్రత్యేక అధికారం ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదల కోసం నళిని శ్రీహరన్, రవిచంద్రన్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.