తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. తండ్రి ఏమన్నారంటే

0
913

తమిళ హీరో విజయ్ కొద్దిరోజుల కిందటే తన రోల్స్ రాయిస్ లగ్జరీ కారు విషయంలో మద్రాసు హై కోర్టుతో చీవాట్లు తిన్న సంగతి తెలిసిందే..! ఇప్పుడు మరో అంశంలో హీరో విజయ్ కోర్టును ఆశ్రయించాడు. అది కూడా ఏకంగా తల్లిదండ్రులపైనే కేసు పెట్టాడు హీరో విజయ్. తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఏకంగా తల్లిదండ్రుల మీదనే కేసు పెట్టాడనే వార్త సంచలనమైంది. హీరో విజయ్ తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఆదివారం కేసు పెట్టాడు. అనుమతి లేకుండా తన పేరు వాడుకుంటున్నారని ఫిర్యాదులో విజయ్ చెప్పారు. తన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, మీటింగ్స్ నిర్వహించకుండా ఉండేందుకే విజయ్ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 27న దీనిపై విచారణ జరగనుంది. ఏడాది క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ‘ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్ పార్టీకి విజయ్ తండ్రి చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీగా, శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. పార్టీ పెట్టిన కొన్నిరోజులకే విజయ్ ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. “మా నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ నాకు సంబంధం లేదు. మా నాన్న పార్టీ పెట్టారని నా ఫ్యాన్స్ ఎవరూ అందులో చేరొద్దు” అని విజయ్ చెప్పారు. పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్ క్లబ్ను గానీ దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా విజయ్ తెలిపారు.

ఇప్పుడు ఏకంగా కోర్టులో విజయ్ సివిల్ కేసు వేశారు. విజయ్ తన తల్లిదండ్రులు సహా మొత్తం 11 మంది, ఇక పై తన పేరుని వాడుకోకుండా, కోర్టుని ఆశ్రయించారు. ఇళయ దళపతి ఫ్యాన్స్‌కు చెందిన ఓ రిజిస్టర్డ్ సొసైటీకి స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఆయన తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. దాంతో కొందరు తాము విజయ్ అభిమానులమంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. తన పేరు పొలిటికల్ మీటింగ్స్‌కి వాడుకోవటంపై అభ్యంతరం తెలియజేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందించారు. సమస్యలు లేని కుటుంబాలు ఉండవని ఆయన అన్నారు. ప్రతి కుటుంబంలోని తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్థలు, గొడవలు ఉండటం మామూలేనని.. కొన్నాళ్లకు అవి సమసిపోతాయన్నారు.