తమిళనాడు రాష్ట్రాన్ని వరుణుడు టెన్షన్ పెడుతూ ఉన్నాడు. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతుండడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం 14 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చెన్నైతో పాటు తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణీపేట్, వెల్లూరు, సాలెం నాగపట్నం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పొన్నేరి, అవడి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో.. తమిళనాడు, పుదుచ్ఛేరి వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.