తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సూర్యుడిని చూసి చాలా రోజులు అయిందని చెబుతూ ఉన్నారు. వర్షాల కారణంగా పరీక్షలు కూడా రద్దయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. వర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ, బీఈడీ పరీక్షలు జరుగుతున్నాయి. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నేడు, రేపు కూడా విస్తారంగా వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాలో నేడు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయట. కోస్తా తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడడం.. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.