శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఆ కార్యక్రమంలో ఏపీలో పరిస్థితి గురించి తన మిత్రుడు చెప్పిన వ్యాఖ్యలంటూ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..! ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని, ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని అన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక నిన్న అర్ధరాత్రి కేటీఆర్ ఓ ట్వీట్ వేసి వివాదాన్ని ముగించాలని చూసారు.
అయితే కేటీఆర్ కు బీజేపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక సలహా ఇచ్చారు. తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రానికి కాకుండా ఉత్తరప్రదేశ్ పంపాలని ఆయన కేటీఆర్కు సూచించారు. ” తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ కు పంపండి @KTRTRS గారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవినీతిని,అరాచకాలను ఎలా బుల్డోజింగ్ చేస్తుందో ప్రజలు చూస్తారు. ధైర్యం చేస్తారా? మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది.” అంటూ జీవీఎల్ ట్వీట్ చేశారు.