హ్యాకింగ్ అవ్వలేదని తేల్చి చెప్పిన ఐటీ మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్రభుత్వ అధికారిక ఈమెయిల్ వ్యవస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్)ని హ్యాక్ చేశారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎన్ఐసీ నిర్వహిస్తున్న ఈమెయిల్ వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ తెలిపింది. ఎన్ఐసీ ఈమెయిల్ వ్యవస్థ ఎంతో సెక్యూర్ గా ఉందని, ఎలాంటి డేటా చొరబాట్లు జరగలేదని తెలిపింది. ఎయిరిండియా, బిగ్ బాస్కెట్, డొమినోస్ సంస్థల్లో భద్రతా లోపాల ద్వారా ఎన్ఐసీ ఈమెయిల్ ఖాతాలు, పాస్ వర్డ్ లు బహిర్గతమవ్వలేదని తేల్చారు. హ్యాక్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. బయటి సంస్థల భద్రతా లోపాల కారణంగా తలెత్తే సమస్యల వల్ల కేంద్ర ప్రభుత్వ ఈమెయిల్ వ్యవస్థలకు ఎలాంటి ప్రమాదం లేదని ఐటీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఒకవేళ ప్రభుత్వ ఈమెయిల్ వినియోగదారులు ఆయా బయటి పోర్టళ్లలో తమ అధికారిక ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయితే తప్ప… సాధారణ పరిస్థితుల్లో ఎన్ఐసీ ఈమెయిల్ వ్యవస్థల్లోకి చొరబడడం వీలు కాదని వివరించింది. ఎన్ఐసీ ఈమెయిల్ వ్యవస్థలో రెండంచెల భద్రత (2 ఫ్యాక్టర్ అథెంటికేషన్) వంటి అనేక ఏర్పాట్లు ఉంటాయని, ప్రతి 90 రోజులకు పాస్ వర్డ్ మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. పాస్ వర్డ్ మార్చుకోవాలంటే మొబైల్ కు వచ్చే ఓటీపీ ఎంతో కీలకమని తెలిపింది. ఓటీపీ లేకుండా పాస్ వర్డ్ మార్చుకోలేరని, ఎన్ఐసీ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తుంటుందని తెలిపింది.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) చేత నిర్వహించబడుతున్న భారత ప్రభుత్వ ఇమెయిల్ వ్యవస్థలో సైబర్ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమని తేల్చి చెప్పింది. వేరే పోర్టల్లపై జరిగిన సైబర్ దాడులు ప్రభుత్వ ఈ-మెయిల్ సేవలను ప్రభావితం చేయకపోవచ్చని స్పష్టం చేశారు.