క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్ లెవన్ తరపున ఆడుతున్న అతను టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పాడు. బయో బబుల్ ఆంక్షలను తట్టుకోలేక టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. దుబాయ్లో జరుగుతున్న ఎడిషన్లో గేల్ రెండు మ్యాచ్లు ఆడాడు. మునుపటి ఫామ్ లో అయితే గేల్ కనపడడం లేదు. ఇక వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో గేల్ మానసిక వత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడిన గేల్ అక్కడ కూడా బయో బబుల్ వాతావరణంలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ బబుల్లోకి వచ్చానని, ఈ నేపథ్యంలో మానసికంగా బలోపేతం కావాలనుకుంటున్నాని గేల్ ఓ ప్రటకనలో తెలిపారు. దుబాయ్లోనే బ్రేక్ తీసుకుంటానని గేల్ చెప్పాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ దాదాపు ఐపీఎల్ నుండి అవుట్ అవ్వగా.. చెన్నై ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది. చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్ఎస్ 9 మ్యాచుల్లో ఓడి, ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరుకున్న తొలి జట్టు అయింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ను 134/7కే కట్టడి చేసిన చెన్నై లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకు ఆడింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ తొలి వికెట్కు 75 పరుగులు జోడించారు. రుతురాజ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా, డుప్లెసిస్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. జేసన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టి జట్టులో ఆశలు రేపాడు. చివర్లో అంబటి రాయుడు (17), కెప్టెన్ ధోనీ (14) మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. హేజిల్వుడ్ మూడు వికెట్లు తీసి హైదరాబాద్ను కష్టాల్లోకి నెట్టాడు. బ్రావో రెండు వికెట్లు తీసుకోవడంతో హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అభిషేక్ శర్మ 18, అబ్దుల్ సమద్ 18, రషీద్ ఖాన్ 17 పరుగులు చేశారు. నేడు కోల్కతా నైట్రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య దుబాయ్లో మ్యాచ్ జరగనుంది.