ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఒక జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన ఇద్దరు సీఆర్ఫీఎఫ్ సిబ్బందిని చికిత్స కోసం రాయ్పూర్కి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఆర్పీఎఫ్ విచారణకు ఆదేశించింది.
దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసిందని చెబుతున్నారు. చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పరిధిలోని లింగంపల్లి బేస్క్యాంపులో ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీపావళి సెలవుల విషయంలో సీఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్ల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వివాదం కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. సంయమనం కోల్పోయిన జవాన్లు పరస్పరం కాల్పులకు తెగబడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనలో బీహార్కు చెందిన రాజమణి యాదవ్, డంజి, బెంగాల్కు చెందిన రాజుమండల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధర్మేందర్ అనే మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.