ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది.
పొజిచలూరు ప్రాంతంలోని ఒక ఇంట్లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి, అతడి భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పదంగా చనిపోయారు. పొరుగు కుటుంబాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.
ఇంటి పెద్ద అయిన ఆ వ్యక్తి తొలుత భార్యను, అనంతరం ఇద్దరు పిల్లలను చంపి చివరకు అతడు ఆత్యహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారంలో ఆర్థిక నష్టాలను భరించలేక ఆ కుటుంబం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తున్నదని ఒక పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.