విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
పార్లమెంట్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు తృణమూల్, శివసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. వారం రోజుల క్రితం పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో ప్రతిపక్షాలకు చెందిన 18 పార్టీల నాయకులు సమావేశమై యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
యశ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత 24 ఏండ్ల పాటు ఐఏఎస్ అధికారిగా కొనసాగి 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా, 1998, 1999, 2009లో హజారీబాగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో చంద్రశేఖర్ కేబినెట్లో ఏడాది పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 2002లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. 2021, మార్చి 13న తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. మార్చి 15న టీఎంసీ వైస్ ప్రెసిడెంట్గా యశ్వంత్ సిన్హా నియమితులయ్యారు.