ఎవరు.. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారని కాదు.. భవిష్యత్తులో ఎలా బ్రతుకబోతున్నారన్నదే చాలా ముఖ్యం. నిరుపేద కుటుంబాల్లో పుట్టే వ్యక్తులు కాస్తా.. కోటీశ్వరులు అవుతుంటారు. అందుకు కారణం వారిలో ఉన్న సత్తా.. కాస్త అదృష్టం. అలా ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి ఇప్పుడు అమెరికాలో పీహెచ్డీ చేయబోతోంది. ఆమె తండ్రి పూలు అమ్మి.. ఆమెను చదివించాడు.. ఇప్పుడు తన తండ్రి గర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది.
ముంబై వీధుల్లో పూల దండలు అమ్మడంలో తండ్రికి సహాయంగా ఉన్న 28 ఏళ్ల సరితా మాలి ఇప్పుడు కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్ పొందింది. ఆమె ప్రస్తుతం JNUలోని భారతీయ భాషా కేంద్రంలో హిందీ సాహిత్యంలో PhD చేస్తోంది. ఆమె JNU నుండి MA, Mphil డిగ్రీలను తీసుకుంది. జూలైలో ఆమె తన PhDని సమర్పించనుంది. ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఆటుపోటులు ఉంటాయని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగడమే జీవిత లక్ష్యం’ అని సరితా చెప్పుకొచ్చింది. పండుగల సమయంలో, ఆమె తన తండ్రితో కలిసి పూలు అమ్మేది. గణేష్ చతుర్థి, దీపావళి, దసరా వంటి పెద్ద పండుగలలో పువ్వులు అమ్మేది. స్కూల్ లో చదువుతున్నప్పటి నుండి తన తండ్రితో ఆమె కలిసి ఈ పని చేస్తూ ఉండేది. జేఎన్యూ నుంచి సెలవులకు వెళ్లినప్పుడల్లా ఆమె తన తండ్రికి సహాయం చేస్తూ ఉండేది. గత రెండు సంవత్సరాలుగా మహమ్మారి కారణం ఆమె తండ్రికి పెద్దగా ఆదాయం లేకుండా పోయింది. చిన్నప్పటి నుండి తన ఇంటి కష్టాలు తెలిసిన సరితా.. తమ బతుకులు మారాలని అనుకుంటూ ఉండేది.. అందుకు తగ్గట్టుగానే ఆమె బాగా చదువుతూ ఉండేది.
సరితా మాలి కుటుంబంలో ఆమె తల్లి, తండ్రి, అక్క, ఇద్దరు తమ్ముళ్లతో సహా 6 మంది సభ్యులు ఉన్నారు. ఆమె తండ్రి మాత్రమే సంపాదించేవారు. లాక్డౌన్ కారణంగా ఆమె తండ్రి జౌన్పూర్లోని బద్లాపూర్లోని తన స్వగ్రామానికి వెళ్లాడు. “జెఎన్యు నా జీవితానికి టర్నింగ్ పాయింట్, ఎంఏ లో జెఎన్యులో చేరడం నా జీవితాన్ని మలుపు తిప్పింది.. అక్కడ నాకు అడ్మిషన్ దక్కకపోయి ఉండి ఉంటే.. ఇప్పుడు నేను ఏమై ఉండేదాన్నో నాకే తెలియదు.” అని చెప్పుకొచ్చింది.
2010లో, ఆమె బంధువు ఒకరు జెఎన్యు గురించి ఆమెతో ప్రస్తావించారు. అప్పటికి ఆమెకు చాలా విషయాలు తెలియవు. ఆమె BA మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు.. JNU కోసం ప్రిపరేషన్ ప్రారంభించింది. 2014లో, ఆమె తన మాస్టర్స్ కోసం జెఎన్యుకు ఎంపికైంది. ఇక తన రోజువారీ కష్టాల నుండి చాలా నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. “ఇప్పుడు నాపై మరిన్ని బాధ్యతలున్నాయని భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చానో అని వెనక్కి తిరిగితే నమ్మలేకపోతున్నానని ఆమె తెలిపింది. జెఎన్యుకి వచ్చిన తర్వాత మనం చాలా సాధించగలమని నమ్మకం ఏర్పడింది” అని ఆమె చెప్పింది. “నేను JNUలో అతి పిన్న వయస్కురాలైన రీసెర్చ్ స్కాలర్లలో ఒకరిని. నేను ఇక్కడ ఎంఫిల్లో చేరినప్పుడు నాకు 22 ఏళ్లు” అని ఆమె తెలిపింది.