ఆవుల తరలింపు అడ్డుకున్న ఎస్సై.. వాహనంతో తొక్కించి హత్య చేసిన ముఠా

0
889

మాఫియా ఏది అయితేనేం వారి ఆగడాలకు అడ్డుఅదుపులేకుండా పోతోంది. అడ్డుపడితే అధికారులను సైతం అంతం చేయడానికి వెనకాడటం లేదు. పోలీసు ఉన్నతాధికారులని కూడా చూడకుండా దాడులకు దిగుతున్నారు. వాహనాలతో తొక్కించి మరీ దారుణంగా హత్యలు చేస్తున్నారు.

హర్యానాలో డీఎస్పీ హత్య జరిగిన కొద్ది గంటల్లోనే అదే తరహాలో జార్ఖండ్‌లో మహిళా ఎస్సై దారుణంగా హత్యకు గురైంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో గత రాత్రి సంధ్యా టోప్నో అనే మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా హత్యకు గురయ్యారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హత్య చేశారు.

ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. మృతురాలు సంధ్యా టోప్నో తుపుదానా పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ చెక్​పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సంధ్య.. దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను పట్టించుకోకుండా నిందితులు.. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో సబ్ ఇన్​స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్‌కు తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై సంధ్య వాహనంలో గోవులను తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఆపడానికి ప్రయత్నించిందని.. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఆమె పైకి వాహనాన్ని ఎక్కించి మరణానికి కారణమయ్యాయడని రాంచీ సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కౌశల్ కిషోర్ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

దేశంలో అక్రమంగా గోవుల తరలింపు అధికం అవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలను అమల్లోకి తీసుకువస్తున్నాయి. చాలా వరకు రాష్ట్రాల్లో అవుల తరలింపు నిషేధం విధించగా జార్ఖండ్ లోనూ గోవుల తరలింపుపై చట్టాలు అమల్లోకి తీసుకువచ్చారు. 2015 నుంచే గోవుల తరలింపుపై అక్కడి రాష్ట్రంలో నిషేధం ఉంది. ఆవులు, ఎద్దుల వధ, మాంసం తినడం, నిల్వపై నిషేధం విధించింది. అలాగే చట్టాన్ని ఉల్లంఘిస్తే పదేళ్ల జైలు విధించడంతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తారు. అయినా కూడా జార్ఖండ్ లో అక్రమంగా గోవుల తరలింపు ఆగడం లేదని ఎస్సై హత్యతో మరోసారి అర్ధం అవుతుంది. కానీ అక్రమార్కులు ఏకంగా ఎస్సైనే హత్య చేయడం మాత్రం అందర్ని విస్మయానికి గురి చేస్తోంది.

అయితే హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్‌ అధికారిని మైనింగ్‌ మాఫియా హత‍్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది. డీఎస్పీ సురేంద్ర సింగ్‌ బిష్ణోయ్‌ హత్య కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. దోషులను విడిచిపెట్టబోమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాను నియంత్రిస్తామని, బాధ్యులను విడిచిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైనింగ్ ప్రాంతాలకు సమీపంలో పోలీసు పోస్టులను ఏర్పాటు చేస్తామని, మైనింగ్ వాహనాల గమ్యం, వాటి సామగ్రిని కూడా స్థిరపరుస్తామని ఖట్టర్ చెప్పారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

14 + nine =