మూఢనమ్మకాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.. ప్రాణాలు తీస్తున్నారు కూడా..! సొంత కుటుంబ సభ్యులే మూఢనమ్మకాల మాయలో పడి సొంతవాళ్ల ప్రాణాలు తీయడానికి వెనకడుగు వేయడం లేదు. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన.వేణుగోపాల్,యామిని లకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. పెళ్లైన పదేళ్ల తర్వాత వీరు పుట్టడంతో పిల్లలను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉండేవారు. అయితే గత మూడు రోజులుగా చుట్టుపక్కల వారికి ఎవరికీ తెలియకుండా తన ఇంట్లో వేణు శాంతి పూజలు నిర్వహిస్తున్నాడు. అయితే అవి క్షుద్రపూజలని తర్వాత తెలిసొచ్చింది. పూజలో కూర్చున్న వేణు తన కాళ్ళ మీద తన రెండవ కూతురు పునర్వికను పడుకో పెట్టి నోట్లో కుంకుమ పోశాడు. ఆమె గొంతు నులుమడం కూడా చేయడంతో.. పెద్ద పాప పూర్విక పెద్దగా ఏడుస్తూ బయటికి పరుగులు తీసింది. ఇది గమనించిన మేనమామ చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించాడు. వెంటనే వేణు దగ్గర ఉన్న పాపను తీసుకుని వచ్చేశాడు. పాపను రక్షించి ప్రాథమిక చికిత్స కోసం ఆత్మకూరు లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తండ్రి వేణుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.