ఫ్యాక్ట్ చెకర్ పేరుతో దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాడని ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ పై యూపీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. అయితే జుబేర్ కు అత్యున్నత న్యాయస్థానం అండగా నిలిచింది. ఆయనపై ఎలాంటి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులకు సూచించింది.
జుబేర్ కు కేసుల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జుబేర్పై దాఖలైన ఐదు కేసుల విషయంలో తాము తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని యూపీ పోలీసులను ఆదేశించింది. అయితే జుబేర్ పై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయ్యాయి. అందులో ఆరో కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది. సీతాపూర్, లఖింపూర్ఖేరీ, గాజియాబాద్, ముజఫర్నగర్, హత్రాస్ జిల్లాల్లో నమోదైన ఆరు ఎఫ్ఐర్లను రద్దు చేయాలని జుబేర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వాటన్నిటిలో ప్రాథమిక ఆరోపణ మతపరమైన భావాలను గాయపర్చారని.. కొన్ని ఇతర నేరాలను కూడా ఎఫ్ఐఆర్లలో ప్రస్తావించారు. ఇలా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడానికి ముగింపు పలకాలి. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని జుబేర్ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ కోర్టుకు నివేదించారు.
పిటిషనర్ నివేదనపై 20న విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అంతవరకు అతనిపై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని సుప్రీంకోర్టు యూపీ పోలీసులకు స్పష్టం చేసింది. ఇతర కోర్టులు ఆదేశాలు జారీచేయడంపై ఎలాంటి నిలిపివేత వద్దని యూపీ తరఫు న్యాయవాది కోరినప్పుడు న్యాయమూర్తి చంద్రచూడ్ అందుకు నిరాకరించారు. ఒక కేసులో మధ్యంతర బెయిల్ లభిస్తే ఇంకొ క కేసులో అరెస్టు చేస్తారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ కేసుల పరంపర జుబేర్పై ఢిల్లీలో మొదలైంది. నాలుగేండ్ల నాటి ట్వీట్లో 1983 నాటి సినిమా దృశ్యం ఉపయోగించినందుకు అరెస్టు చేశారు. ఆ తర్వాత హిందువులపై దాడులు చేసే విధంగా ఓ మతాన్ని రెచ్చగొట్టిన కేసులో యూపీలోని సీతాపూర్లో అరెస్టు చేశారు. ఢిల్లీ కేసులో జిల్లా జడ్జి నుంచి బెయిల్ లభించింది. సీతాపూర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. హత్రాస్ కేసులో ప్రస్తుతం అరెస్టు కింద ఉన్నారు. ఇది స్థానిక న్యాయస్థానంలో విచారణ ఉండింది.
యూపీ పోలీసులు మొత్తం ఆరు కేసులకు కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వాటన్నటినీ కొట్టివేయాలని జుబేర్ ధర్మాసనాన్ని కోరుతున్నాడు. ఆయన తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ తక్షణ ఉపశమనం వేడుకోగా సీతాపూర్ కేసులో ఊరట కల్పించాం కదా అంటూ న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రశ్నించారు. అప్పుడు న్యాయవాది మొత్తం ఆరు కేసులు ఉన్నాయని, కొన్ని గత ఏడాది కేసులని చెప్పారు. కొన్నిటిలో ఆయనను జుడీషియల్ కస్టడీకి పంపారని, ఆయన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఇక హత్రాస్ కేసులో 14 రోజుల రిమాండును అడుగుతున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రస్తుత కేసు విచారణకు తొందర ఏమున్నదని అన్నారు. మతోన్మాద ప్రకటనలతో చేసిన ఫిర్యాదుల ఆధారంగా జుబేర్పై చర్యలు తీసుకుంటున్నారని, జర్నలిస్టులను శిక్షించేందుకు ఉపయోగించుకోవాల్సిన ఫిర్యాదులేనా అవి? అన్నారు. జుబేర్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడే జూలై 4న అతనిపై హాత్రాస్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వృందా గ్రోవర్ తెలిపారు.