భారత ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే..! ఈ నిబంధనలను పలు సోషల్ మీడియా దిగ్గజాలు అనుమతించాల్సిందే..! కొత్త ఐటి నిబంధన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం, ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లు (5 మిలియన్లకు పైగా యూజర్లు) ప్రతి నెలా ఫిర్యాదుల నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. ఆయా వేదికలపై ఫిర్యాదుల వివరాలను, దానిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలి.
తాజాగా ఫేస్ బుక్ సంస్థ తాము తీసుకున్న చర్యల గురించి వివరించింది. ఐటీ నిబంధనల ప్రకారం దేశంలో మే 15 – జూన్ 15 మధ్యకాలంలో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్టు వెల్లడించింది. స్వేచ్చాయుత భావవ్యక్తీకరణతో పాటు, ఆన్లైన్ భద్రత,రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఫేస్బుక్ ప్రతినిధి వెల్లడించారు. ఫిర్యాదులు, కృత్రిమ మేధస్సు, తమ సమీక్షా బృందం నివేదికల ఆధారంగా తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్ను గుర్తిస్తామని తెలిపింది.
ఫేస్బుక్ కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్ను తొలగించింది. తన తొలి నెలవారీ కంప్లయిన్స్ నివేదికలో ఈ వివరాలు తెలిపింది. తమ తదుపరి నివేదికను జులై 15న వెల్లడిస్తామని చెప్పింది. తమకు యూజర్లు చేసిన ఫిర్యాదులతో పాటు వాటిపై తీసుకున్న చర్యల వివరాలు తెలుపుతామని వెల్లడించింది. మే 15 నుంచి జూన్ 15 మధ్య తాము తమ సైట్లో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద దాదాపు 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్లు తెలిపింది. ఫేస్బుక్కు చెందిన ఇన్స్టాగ్రామ్లోనూ అభ్యంతరకర పోస్టులపై చర్యలు తీసుకుంటున్నారు. స్పామ్ పోస్టులు 25 మిలియన్లు, హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ అభ్యంతరకర పోస్టులు 2.5 మిలియన్లు, అశ్లీల, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్ల కంటెంట్లు ఇందులో ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాద చర్యల ప్రచారానికి సంబంధించి లక్షకు పైగా పోస్టులు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన మూడు లక్షలకు పైగా పోస్టులు, వేధింపులకు సంబంధించిన లక్షలకు పైగా పోస్టులు ఇందులో ఉన్నాయని తెలిపింది.