దేశంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! బీహార్లోని అనేక ప్రాంతాలు గత కొన్ని రోజులుగా.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలని ఎదుర్కొంటూ ఉన్నాయి. వర్షాకాలంలో, గంగానదితో సహా బీహార్లోని నదులలో నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యంత ప్రమాదకర రీతిలో నదులు ప్రవహిస్తూ ఉన్నాయి.
ఇటీవల, బీహార్లోని వైశాలి జిల్లాలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ నియోజకవర్గం రాఘోపూర్లో కూడా వరదలు వచ్చాయి. గంగా నది ఉప్పొంగింది. ఆ సమయంలో ఒక ఏనుగు తన మావటిని కాపాడింది. నదిని దాటడానికి ప్రయత్నిస్తుండగా.. ఉధృతమైన వరదలో మావటిని అలాగే ఎక్కించుకుని ఏనుగు ఒడ్డుకు చేరుకుంది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఏనుగు దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయి కనిపించింది.