మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వస్తున్న విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పందించింది. ఎన్నికల సంఘం ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ కాసేపటి క్రితం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని.. మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా జరుగుతోందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని.. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్న కారణంగానే ఓట్ల లెక్కింపు అనుకున్న దాని కంటే ఆలస్యంగా జరుగుతోందన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో.. ఆయా రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో ఐదుగురు, ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారని.. మునుగోడులో ఏకంగా 47 మంది అభ్యర్థులు పోటీ చేసిన విషయాన్ని అందరూ గుర్తించాలని ఆయన తెలిపారు. రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడు (అబ్జర్వర్)లతో పాటు ఆయా అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతోందని తెలిపారు.