అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..! తన అనుచరులను రెచ్చగొట్టడమే తన పనిగా పెట్టుకునే వాడు ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో యూఎస్ కాపిటల్ భవనంపై దాడి సమయంలో హింసను ప్రేరేపించేలా కామెంట్లు చేశారని పేర్కొంటూ ట్విట్టర్, ఫేస్ బుక్ రెండు సంస్థలూ ట్రంప్ ఖాతాలను బ్యాన్ చేశాయి. దీంతో ట్రంప్ ఫ్లోరిడాలోని కోర్టులో కేసు వేశారు. తన ఖాతాలను పునరుద్ధరించేలా ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించాలని ట్రంప్ కోరారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ట్రంప్ తన ఖాతాలు బ్యాన్ అయినప్పటి నుంచి ప్రజలకు ఏం చెప్పాలన్నా కష్టంగా ఉందని ఆయన సన్నిహితుల దగ్గర వాపోయాడట..! అయితే ట్రంప్ అభ్యర్థనను సోషల్ మీడియా దిగ్గజాలు పట్టించుకోలేదు. ఇక అయ్యే పని కాదనుకున్నాడో ఏమో కానీ.. ట్రంప్ ఇక సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను తీసుకుని వస్తున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే చాలా సార్లు కథనాలు వచ్చాయి.. కొందరు ఇదంతా కుదరదు అని విమర్శించారు. కానీ ట్రంప్ బ్యాచ్ అనుకున్నట్లుగానే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను తీసుకుని రాబోతోంది.
ట్రంప్ సొంతంగా కొత్త సోషల్ నెట్వర్క్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దాని పేరు TRUTH Social. ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) దీనికి యజమానిగా ఉంటుందని తెలిపారు. వచ్చే నెలలో ఈ సోషల్ నెట్వర్క్ బీటా వెర్షన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియా కథనాలు వచ్చాయి. ఆపిల్ సంస్థ యాప్ స్టోర్లో ఇది ప్రీఆర్డర్పై అందుబాటులో ఉంది. TRUTH Socialతోపాటు ఓ వీడియో ఆన్ డిమాండ్ సర్వీస్ను టీఎంటీజీ తీసుకుని వస్తోంది. పెద్ద టెక్ కంపెనీల నిరంకుశత్వానికి దీటుగా నిలబడేలా ఈ TRUTH Socialను సృష్టించినట్లు ట్రంప్ తెలిపారు. తాలిబాన్లకు కూడా అవకాశం ఉన్న ట్విటర్లో మీకు ఎంతో ఇష్టమైన అమెరికా అధ్యక్షుడికి స్థానం లేకుండా పోయిందని.. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. “We live in a world where the Taliban has a huge presence on Twitter, yet your favourite American President has been silenced. This is unacceptable.” అంటూ ట్రంప్ తన సందేశాన్ని పంచుకున్నారు.
