జింబాబ్వేతో వన్డే సిరీస్ లో టీమిండియా మొదటి మ్యాచ్ లో భారీ విజయాన్ని సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. తొలుత జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసిన భారత్.. లక్ష్యఛేదనలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 30.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 81, శుభ్ మాన్ గిల్ 82 పరుగులతో అజేయంగా నిలిచారు. 113 బంతులెదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు బాదాడు. యువ ఆటగాడు గిల్ 72 బంతులాడి 10 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు.
ఇక మొదట బౌలింగ్ చేసిన భారత బౌలర్లలో దీపక్ చహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు పడగొట్టడంతో.. జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్ రెజిస్ చకబ్వా 35, రిచర్డ్ ఎన్గరవా 34, బ్రాడ్ ఇవాన్స్ 33 పరుగులతో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓవర్లన్నీ పూర్తికాకుండానే ఆలౌటైంది. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 20న ఇదే మైదానంలో జరగనుంది.