రాజకీయ జీవితం చివరి దశకు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన చెందుతున్నారని, దాన్ని తాను అర్థంచేసుకుంటానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తనపై ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమన్న ఆమె ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ కవిత కులాహంకారంతో మాట్లాడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవితలకు విపరీతంగా కులాహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు. తన ఇంట్లో విధ్వంసం సృష్టించి 70 ఏళ్ల తల్లిని బెదిరించి ఇతర మహిళలను కొట్టే హక్కు ఆమెకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కవిత ఇష్టానుసారం వ్యవహరించేందుకు ఇది దొరల పాలన కాదని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఏక్నాథ్ షిండే అయ్యేంత సీన్ ఎమ్మెల్సీ కవితకు లేదని.. కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తన ఆరోపణలపై కవిత ఇంతగా రియాక్ట్ అయిందంటే అది నిజమై ఉండొచ్చని అన్నారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసే కేసీఆర్ తన బిడ్డ కాల్ లిస్ట్ తీస్తే నిజానిజాలు బయటకొస్తాయని.. తన బిడ్డకు బీజేపోళ్లు ఫోన్ చేసిండని స్వయంగా కవిత తండ్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు.
బీజేపీ వాళ్లు కవితకు ఫోన్ చేశారని కేసీఆర్ చెప్పారని, మరి కేసీఆర్ ఇంటి మీద దాడి చేస్తావా? అని అర్వింద్ ప్రశ్నించారు. మీ అయ్య ఇల్లు ధ్వంసం చేసుకోపో.. నా తల్లి మీద దాడి చేసే హక్కు ఎవరు ఇచ్చారని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. కవిత రాజకీయ జీవితం ముగిసిపోయిందని.. ఆమె పోటీ చేయదలచుకుంటే నిజామాబాద్ కు రావాలని, తనపై పోటీ చేయాలని కోరారు. మీ దొరతనం ఇంకా ఎన్నాళ్లో సాగదని అరవింద్ అన్నారు.