ఈ వార్త చూడగానే ఓ సినిమాలో సన్నివేశం గుర్తుకువచ్చింది. అందులో ఇద్దరు నటుల మధ్య మద్యపానం ఎంతటి ప్రమాదకం అన్నది చర్చ. కాకపోతే వారు మద్యం పుచ్చుకుంటూనే మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతుంటారు. సినిమాకది హాస్యభరిత సన్నవేశం అయినా ప్రస్తుత పాలకులకు సీరియస్ గా యాప్ట్ అయ్యే సీన్ అది.
ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు మహిళా మణుల ఓట్లను ఆకర్షించడానికి ఇచ్చే ప్రధాన హామీ మద్యపాన నిషేధం. తీరా అది నమ్మి ఓట్లేశాక బ్రాండ్లు మార్చి ఓన్ మ్యాన్యుఫాక్చరింగ్ తో మద్యం ఏరులై పారిస్తారు. ధరలు పెంచుతారు.. ఎందుకంటే అలాగైనా తాగుబోతులు దూరంగా ఉంటారని చెబుతారు. దీంతో మ్యాటర్ జనానిని ఎప్పుడో అర్ధమయిపోయింది. ఈ మద్యపాన నిషేధం హామీ.. లేదా దాని నియంత్రణపై చేసే వ్యాఖ్యలు గాలి మాటలు అని. ఈ మాటలు నిజమనిపించేలా చేసింది ఢిల్లీ ప్రభుత్వం.
దేశ రాజధాని ఢిల్లీలో మద్యపానం కోసం చట్టబద్దమైన వయస్సును 25 నుండి 21 కి తగ్గించినట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తాజాగా వెల్లడించారు. నూతన మద్యం విధానాన్ని ప్రకటించిన ఆయన ఢిల్లీ ప్రభుత్వం సంస్కరణలతో వార్షిక ఎక్సైజ్ ఆదాయంలో కనీసం 20 శాతం పెంపును ఆశిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సిసోడియా చెప్పారు. దేశ రాజధానిలో కొత్త మద్యం షాపులు తెరవబోమని ఆయన ప్రకటించారు. మంత్రుల బృందం సిఫారసుల ఆధారంగా ఈ రోజు కొత్త ఎక్సైజ్ విధానాన్ని కేబినెట్ ఆమోదించింది. కాగా ప్రస్తుతం, దేశ రాజధాని ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రభుత్వమే నిర్వహిస్తోంది.
ఇక కొత్త నిబంధనల ప్రకారం, మద్యం దుకాణానికి కనీస అనుమతించదగిన ప్రాంతం 500 చదరపు అడుగులు. అలాంటి స్టోర్ యొక్క ప్రధాన ద్వారం రహదారికి ముందు ఉండటానికి వీల్లేదు. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మద్యం దుకాణాలను నిర్మించాలి. దుకాణ యజమానులు తమ దుకాణాల దగ్గర బహిరంగ మద్యపానం జరగకుండా చూసుకోవాలి.
అయితే ప్రభుత్వం వెల్లడించిన ఈ వివరాలు చూస్తుంటే ఒకవైపు ఆదాయవనరుగా మద్యం షాపులను ఎంచుకుంటూనే.. నీతులు వల్లె వేస్తున్నట్లు ఉంది. వయోపరిమితిని 21 కి తగ్గించడంతో యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ నెటిజన్లు యథావిధిగా ట్రోల్స్ లో కేజ్రీవాల్ సర్కార్ ను దుయ్యబడుతున్నారు. అయినా ఒక్క కేజ్రీవాల్ ఏంటి.. ఇటు ఏపీ సీఎం జగనైనా.. తెలంగాణ సీఎం కేసీఆర్ అయినా వారి ప్రభుత్వాల ద్వారా ఇటువంటి విధానాలనే కదా అనుసరిస్తున్నది అని చెప్పుకుంటున్నారు. కానీ ఆదాయ మార్గం అంటే ఇలా జనం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎంచుకునేదా.. లేక.. జనహిత మార్గాన్ని ఎంచుకునేలా ఉండాలా అనేది మీరే కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి.