ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయినపల్లి అభిషేక్ రావుకు విధించిన సీబీఐ కస్టడీ మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కేసులో సౌత్ లాబీ పేరిట అభిషేక్ రావు పెద్ద మొత్తంలో నగదును వినియోగించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు ప్రశ్నించినా తమకు సరైన సమాధానాలు చెప్పడం లేదని.. ఈ కారణంగానే అభిషేక్ను తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టును కోరారు. కోర్టు అనుమతితో ఇప్పటికే సీబీఐ అధికారులు అభిషేక్ను 3 రోజుల పాటు విచారించారు. కోర్టు నిర్దేశించిన గడువు గురువారం పూర్తి కావడంతో అభిషేక్ను సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అభిషేక్ను మరో 2 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని కోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన కోర్టు అభిషేక్ రావును మరో 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. బోయిన్పల్లి అభిషేక్ అనేక మంది మద్యం వ్యాపారుల కోసం లాబీయింగ్ చేస్తున్నాడని కూడా ప్రచారంలో ఉంది. సమీర్ మహేంద్రుతో ఉన్న అనుబంధంపై అభిషేక్ను ప్రశ్నించారు. ఆదివారం సీబీఐ-ఢిల్లీ విభాగం అతన్ని విచారణకు పిలిచి, అదే రోజు సాయంత్రం అరెస్టు చేశారు. అభిషేక్రావు దక్షిణాది లాబీగా వ్యవహరిస్తున్నారని, కార్టెలైజేషన్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. అభిషేక్ రావుకి 9 కంపెనీలతో సంబంధం వుంది.కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం తొమ్మిది కంపెనీల్లో అభిషేక్ రావు వాటాలు కలిగి వున్నాడు. ఆ 9 కంపెనీల్లో వివిధ రకాల వ్యాపారాలు వున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ క్వారీయింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్ మరియు కెమికల్ ప్రొడక్స్ట్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసులు వున్నాయి.