రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఇతర ప్రముఖులకు ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ప్రధానితో పాటు ఇతర వీవీఐపీల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్ర దాడుల కుట్ర గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 9 పేజీల హెచ్చరికను తాజాగా జారీ చేసింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లకు చెందిన ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఖలిస్తానీ టెర్రర్ గ్రూపులు ప్రధానమంత్రి సమావేశ వేదికలపై దాడికి ప్లాన్ చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. తీవ్రవాదులు డ్రోన్లను ఉపయోగించి కూడా దాడులు చేసే అవకాశముందని నిఘా సంస్థలకు సమాచారం అందింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
దీంతో ఢిల్లీ ప్రాంతాన్ని “చాలా హై-సెక్యూరిటీ” జోన్ కింద ఉంచినట్లు అధికారులు తెలిపారు. జనవరి 20 నుండి ఢిల్లీలో డ్రోన్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, పారాగ్లైడర్లు మొదలైనవి ఎగరడాన్ని నిషేధించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దేశ రాజధానిలో ఉగ్రవాదుల ఆకాశ మార్గంలో దాడులు జరిగే అవకాశం ఉందని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు. పారా-గ్లైడర్లు, పారా-మోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లు, మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు), మానవరహిత విమాన వ్యవస్థలు (UASలు), మైక్రో-లైట్ ఎయిర్క్రాఫ్ట్, రిమోట్గా పైలట్ చేయబడిన విమానం, హాట్ ఎయిర్ బెలూన్లు, చిన్న సైజు పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్, క్వాడ్కాప్టర్లు, పారా-జంపింగ్ వంటి వాటిని ఫిబ్రవరి 15 వరకు విమానాలను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉగ్రవాదులు సాధారణ ప్రజలు, ప్రముఖులు, ముఖ్యమైన ప్రాంతాలపై దాడులు చేయవచ్చని భద్రతా ఏజెన్సీల నుండి ఇన్పుట్లు అందడంతో ఢిల్లీ పోలీసులు ముందుజాగ్రత్తగా ఈ చర్యలను చేపట్టారు. తమ సూచనలను ధిక్కరిస్తే శిక్షార్హులవుతారని పోలీసులు తెలిపారు.
“రెండు వేర్వేరు ప్రదేశాలలో యాంటీ-డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసు సిబ్బంది కూడా ఎత్తైన భవనాలపై అదనపు నిఘా కోసం మోహరించనున్నారు. శత్రు విమానాలను పర్యవేక్షించడానికి, కూల్చి వేయడానికి ఎయిర్ డిఫెన్స్ గన్స్ అందుబాటులో ఉన్నాయి” అని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ) దీపక్ యాదవ్ అన్నారు.