భారత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కరువు భత్యాన్ని మూడు శాతం పెంచినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 28 శాతం నుంచి 31 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. డీఏ పెంపు వల్ల 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పెన్షనర్లకు కూడా డీఏను పెంచామని, వారికి కూడా ఈ లబ్ధి చేకూరుతుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వ్యాక్సినేషన్లో భారత్ బిలియన్ డోసులను పంపిణీ చేసిన నేపథ్యంలో ఆయన దేశ ప్రజలకు కంగ్రాట్స్ తెలిపారు. వంద కోట్ల మార్క్ను అందుకున్న సందర్భంగా దేశ ప్రజలకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు మంత్రి ఠాకూర్ వెల్లడించారు.
చైనా మాత్రమే భారత్ కు ముందు వంద కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించింది. భారతదేశంలో ఈ ఏడాది జనవరి 16 న హెర్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. కరోనా ఫ్రంట్ లైన్ యోధుల అందరికీ ఇస్తూ.. దేశంలో ఫిబ్రవరి 19న కోటి డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఏప్రిల్ 11న 10 కోట్ల డోసులు వినియోగించిన దేశంగా భారత్ నిలిచింది. జూన్ 12న 25 కోట్ల డోసులు, ఆగస్టు 6న 50 కోట్ల డోసులు, సెప్టెంబర్ 13న మొత్తం 75 కోట్ల డోసుల వినియోగం పూర్తయింది. నేటితో 100 కోట్ల డోసుల వినియోగం పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు.