More

    తీవ్ర తుపానుగా మారిన అసని..!

    బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను అసని ఏపీ తీరాన్ని సమీపిస్తోంది. కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖకు 310 కిమీ దూరంలోనూ, ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిమీ దూరంలోనూ ఉంది. అసని గత ఆరు గంటలుగా 25 కిమీ వేగంతో కదులుతోందని, రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి కాకినాడ-విశాఖపట్నం తీరాలకు అత్యంత చేరువగా వస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

    దిశ మార్చుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలను ఆనుకుని పయనం సాగిస్తుందని వివరించింది. మే 11వ తేదీ ఉదయానికి ఇది తుపానుగా బలహీనపడుతుందని, 12వ తేదీ ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. అసని తీవ్ర తుపాను ప్రభావంతో నేడు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ తెలిపింది.

    ఈ రోజురాత్రి నుంచి ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఉత్తరాంధ్రలో వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలకు SDRF, NDRF బృందాలు సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

    Trending Stories

    Related Stories