కరోనా వైరస్ మహమ్మారి.. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. 30 మ్యుటేషన్లతో ఇది భయానకంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో దీనికి సంబంధించిన వేరియంట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తోంది. ఆయా దేశాల్లో కరోనా వైరస్ కేసుల్లో పెరుగుదలకు ఇదే కారణమని భావిస్తూ ఉన్నారు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ కు ఈ కొత్త వేరియంట్ కారణమయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మొదటి, సెకెండ్ వేవ్లలో కంటే ఇప్పుడు ఆఫ్రికాలో పరిస్థితులు మరింత దిగజారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ను బీ.1.1.529 (B.1.1.520)గా గుర్తించారు. దీనికి సంబంధించి 30 మ్యుటేషన్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కొత్త రకం వేరియంట్కు శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. కొత్త రకం వేరియంట్ దక్షిణాఫ్రికా, బోట్సువానా సహా ఆసియాలోని హాంగ్కాంగ్లోనూ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ బారిన పడిన వారు.. దక్షిణాఫ్రికాలో పర్యటించారు. తమ స్వదేశానికి వెళ్లారు. అనంతరం వారు అనారోగ్యానికి గురయ్యారు. వారికి పరీక్షలను నిర్వహించగా.. బీ.1.1.529 బారిన పడినట్లు తేలింది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా శివార్లలోని ష్వానె మెట్రోపాలిటన్ ఏరియాలో ఈ వైరస్ను తొలిసారిగా గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ పై జాగరూకతతో ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల కఠిన నిబంధనలు అమలు చేయాలని, ముఖ్యంగా హాంకాంగ్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చేవారిని నిశితంగా పరిశీలించాలని సూచించింది. దక్షిణాఫ్రికా సహా ఆఫ్రికన్ దేశాల ట్రావెల్ హిస్టరీ ఉన్న ప్రయాణికులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. విమానాశ్రయాల్లో తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలను కొనసాగించాలని ఆదేశించింది.