భారతదేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో ఒక్కరోజులో 8,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత దేశంలో 289 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 569 రోజుల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 84,565 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,41,71,471కు పెరిగింది. అదే సమయంలో మృతుల సంఖ్య మొత్తం 4,77,158కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 136,66,05,173కు చేరింది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,781 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 84 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 203 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,71,450 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,782 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 4,013కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 33,050 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 127 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 32 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 180 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,477కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,59,311 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,758 మంది చికిత్స పొందుతున్నారు.