భారతదేశంలో గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 675 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో 4,377 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు. భారతదేశంలో ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 4.24 కోట్ల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,15,877 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 11,980 కరోనా పరీక్షలు నిర్వహించగా, 57 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 606కు చేరుకుంది. అదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18,858 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,522 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 14,730 మంది మృత్యువాతపడ్డారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,128 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,85,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 950 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మరణించారు.