భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారీగా కరోనా కేసులు పెరుగుతూ వెళ్ళగా.. ఇటీవలి కాలంలో కాస్త తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా భారత్ లో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక గత 58 రోజుల్లో తొలిసారి అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 7న 1,15,736 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,20,529 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అంతేకాకుండా వరుసగా 23వ రోజు రోజువారీ కేసుల కంటే రికవరీలు అధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల సమయంలో 1,97,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 3,380 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,94,879కి చేరింది. ఇప్పటివరకు 2,67,95,549 మంది ఆరోగ్యవంతులు అవ్వగా.. ఇంకా 15,55,248 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక వ్యాక్సినేషన్ విషయంలో భారత్ మరింత ముందుకు వెళుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో కంటే ఎక్కువ మందికి మొదటి డోసు వేసిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు. ఇప్పటిదాకా 17.2 కోట్ల మంది కరోనా టీకా ఫస్ట్ డోసు తీసుకున్నారని చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు.
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. గురువారం డీసీజీఐకి సీరం దరఖాస్తు చేసుకోగా అప్పుడే అనుమతులు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రష్యాకు చెందిన ‘గమలేయా రీసెర్చి ఇన్స్టిట్యట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ’, పూణెలోని సీరం ఇన్స్టిట్యూట్కు మధ్య ఒప్పందం కుదిరింది. భారత్లో స్పుత్నిక్ టీకా తయారీకి ముందుకు వచ్చిన ఆరో సంస్థ సీరంగా నిలిచింది. హెటిరో బయోఫార్మా, గ్లాండ్ ఫార్మా, పనెషియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్ ఈ టీకా తయారీకి అనుమతులు పొందాయి.