చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నా.. కేరళలో మాత్రం కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో అత్యధిక శాతం కేరళలోనే నమోదవుతూ ఉండడంతో చుట్టుపక్కన రాష్ట్రాలు కూడా ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నాయి. భారత దేశంలో గత 24 గంటల్లో 47,092 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,28,57,937కి చేరింది. గత 24 గంటల్లో 35,181 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. దేశంలో కరోనాతో మరో 509 మంది మృతి చెందారు. భారత్ లో కరోనా మృతుల సంఖ్య 4,39,529 కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 3,20,28,825 మంది కోలుకున్నారు. 3,89,583 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 66,30,37,334 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఒక్క కేరళలోనే 32,803 కేసులు నమోదు కాగా, 173 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,402 కరోనా పరీక్షలు నిర్వహించగా, 322 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 76 కొత్త కేసులు నమోదు కాగా, నారాయణపేట, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 331 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,58,376 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,48,648 మంది కోలుకున్నారు. ఇంకా 5,852 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,876కి పెరిగింది.
01-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 56,155 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 175 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు, విజయనగరం జిల్లాలలో 13 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 1,396 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,867కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,15,302 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,86,962 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,473 మంది చికిత్స పొందుతున్నారు.