ఇదేం రాజకీయం! బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ తో దోస్తానా..నా..? అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో… కూటమి కట్టి కలిసి పోటీ చేస్తారా? ఇక కేరళకి వచ్చేసరికి మాత్రం.., కాంగ్రెస్సే మీ ప్రధాన ప్రత్యర్థా..? బెంగాల్ లో పొత్తులు…, కేరళలో కత్తులా..! ఏమిటీ డబుల్ గేమ్! జనమంటే మీకు అంతా చులకనా? అసలు మీరేమనుకుంటున్నారు..! కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల.., కొంచెం ఇష్టం…కొంచెం కష్టం దోస్తానాపైనా సోషల్ మీడియాలో ఇప్పుడు కౌంటర్ల మీద కౌంటర్లు పేలుతున్నాయి.!
ఇక మన స్టోరీలోకి వచ్చేద్దాం.! పశ్చిమ బెంగాల్…, కేరళ…! ఈ రెండు రాష్ట్రాలు ఇండియన్ కమ్యూనిస్టులకు కీలకమైనవి. ఇక్కడ ఇండియన్ కమ్యూనిస్టులు అనడానికి కాసింత ఇబ్బంది పడుతున్నా మాట వాస్తవం.! అసలు కమ్యూనిజమే ఇండియాకు సంబంధించినది కాదు. అది విదేశీ యిజమైనప్పుడు…, ఆ విదేశీ భావజాలాన్ని ఆరాధించేవారిలో.., ఇండియా పట్ల అపారమైన ప్రేమ అనేది ఉంటుందా? ఇదోక డౌట్ ..! అందుకేనేమో భారతీయమైన ప్రతిదాన్ని ఈ కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. నేషనలిజమనేది దేశంలో బలపడితే ఇక కమ్యూనిజం ఊసే.. ఉండదనే తలంపుతో వీరు నిరంతరం భయపడుతుంటారు. దేశంలో జాతీయవాదం బలోపేతం కాకుడదనే తలంపుతో…, పడికట్టు పదాలను సృష్టిస్తారు. కొత్త నినాదాలను తెరపైకి తెస్తుంటారు. చివరకు ఎంతకు దిగజారుతారంటే… మన పుణ్యభూమి భారత్ ను ముక్కలు చేస్తామంటారు. ఆజాదీ ఆజాదీ… భారత్ తేరా బర్బాదీ , భారత్ తేరా తుక్డే తుక్డే హోగా అంటూ నినాదాలు చేస్తుంటారు. స్వామి వివేకానంద, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఖుదీరాం బోస్ కంటే కూడా ఎక్కడో బొలివియా దేశానికి చెందిన కమ్యూనిస్టూ నాయకుడైనా చేగు వేరాను మన దేశానికి యూత్ ఐకాన్ గా ప్రచారం చేస్తారు.
అంతేకాదు వారి పార్టీ కార్యాలయాల్లో సైతం మన దేశ జాతీయనాయకులకు, స్వాతంత్ర్య సమర యోధుల ఫోటోలు ఉండవు. కారల్ మార్క్స్, లెనిన్, స్టాలిన్, డ్రాగన్ చైనాకు చెందిన మావో జెడాంగ్ ఫోటోలను పెట్టుకుని ఆరాధిస్తుంటారు.
ఇక బెంగాల్ విషయానికి వస్తే… కమ్యూనిస్టులు ఆ రాష్ట్రాన్ని 30 ఏళ్లకు పైగా ఏలారు! చివరకు తృణమూల్ అధినేత్రి చేతిలో వరుసగా రెండు సార్లు ఘోరంగా ఓటమి పాలయ్యారు. మొత్తంగా బెంగాల్ లో కనుమరుగయ్యే దశకు చేరుకున్నారు. అయితే ఇప్పుడక్కడ ఉనికి కోసం పోటీ పడుతున్నారు. తాము ఇన్నాళ్ళపాటు ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగానైతే పోరాడారో…అదే కాంగ్రెస్ తో కలిసి ఇప్పుడు పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. దీనికి వారు చెబుతున్న తర్కం…, లాజిక్ ఏంటో తెలుసా? మతతత్వ బీజేపీని బెంగాల్ అధికారంలోకి రాకుండా చేయడం కోసం…, అలాగే మమత నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా…, బెంగాల్ లో కాంగ్రెస్ తోపాటు ముస్లిం మత నేత అయిన సిద్ధిఖితో జట్టుకట్టి పోటీ చేస్తారట.!
బెంగాల్ లో మాత్రం కాంగ్రెస్ తమ మిత్రపక్షమట.! కమ్యూనిస్టులు… కాంగ్రెస్ తోపాటు అబ్బాస్ సిద్ధిఖి ఏర్పాటు చేసిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తో కలిసి… సంయుక్త మోర్చాను ఏర్పాటు చేశారు. సీపీఎం పార్టీ -130, సీపీఐ-09, ఫార్వర్డ్ బ్లాక్ -15, RSP-11, DSP-2 స్థానాలకు పోటీ చేస్తుండగా…, కాంగ్రెస్ 92 స్థానాల్లో అబ్బాస్ సిద్ధిఖీ ఇండియన్ సెక్యులర్ పార్టీ 37 సీట్లల్లో పోటీ చేయనుంది.
ఇక కేరళలో అయితే ఇదే కమ్యూనిస్టులు… అదే కాంగ్రెస్ ను బద్ద శత్రువు గా పేర్కొంటున్నారు. ఇక్కడ ఈ రెండు పార్టీల నేతలు…, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కమ్యూనిస్టులను ఓడించాలని కాంగ్రెస్ నేతలు, కాదు కాంగ్రెస్ నే ఓడించాలని కమ్యూనిస్టూలు గొంతు చించుకుంటున్నారు. నిజానికి కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, కు అలాగే సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ల మధ్య ఎన్నికల్లో అధికార మార్పిడి అనేది జరుగుతూ వస్తోంది. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కూడా ఒకటి నుంచి ఐదు శాతం వరకే ఉంటుంది.
బెంగాల్ లో దోస్తానా చేస్తూ… కేరళ స్టేట్ కు వచ్చేసరికి…మాత్రం కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారని.., మళ్లీ అదేమంటే బీజేపీని బూచిగా చూపి కుటిల రాజకీయాలు చేస్తున్నారని…ఇటు కేరళ ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా సరికొత్త చర్చకు తెరలేపారు. బెంగాల్ లో పొత్తులు, కేరళలో కత్తులు దూసుకోవడం…ప్రజలను మోసం చేయడం కాదా ? కాంగ్రెస్, కమ్యూనిస్టుల నైతికత ఏ పాటిదో ఈ అనైతిక పొత్తులే చెబుతున్నాయని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమందైతే ప్రజలను ఓపెన్ గానే మోసం చేస్తున్నారని…, ఈ అనైతిక పొత్తులపై దేశంలోని నేషనల్ మీడియా కానీ…, రీజినల్ గా ఉండే ప్రాంతీయ మీడియా కూడా ప్రశ్నించకపోవడం చూస్తుంటే…దాల్ మే కూచ్ కాలా హై అంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కొంచెం ఇష్టం..కొంచెం కష్టం తీరుతో. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తున్నాయని…, అయితే బెంగాల్, కేరళ ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీ నేతల చేతుల్లో కమలం పువ్వును పెట్డడం ఖాయమని మరికొంతమంది చమత్కరిస్తున్నారు.