టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నిబద్ధమైన, సువ్యవస్థీతమై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు. 80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది సభ్యులతో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షతంగా తీర్చిదిద్దుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ఎవరూ బద్దలు కొట్టలేని కంచుకోట అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి అని అన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవర్నీ పట్టుకొని ఏడ్చాలో తెలియని పరిస్థితి అని కేసీఆర్ అన్నారు. దిక్కుతోచని సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిపడిందని అన్నారు. అపజయాలు, అవమనాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు, అవార్డులు, రివార్డులే మన పనితీరుకు సాక్ష్యాలు అని కేసీఆర్ అన్నారు. కేంద్రం నుంచి అవార్డు రానటువంటి డిపార్ట్మెంట్ తెలంగాణలో లేదన్నారు. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాళ జలభాండగారంగా మారిందన్నారు. విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్న వేళలో వెలుగు జిలుగుల తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఏ రంగంలో అయినా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నామని అన్నారు కేసీఆర్.
దేశానికే రోల్ మోడల్గా తెలంగాణలో పాలన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు అంటూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు గులాబీ బాస్. జాతీయ స్థాయిలో పాత్రపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఏం కోరుకుంటోంది. దేశం కోసం తన లక్ష్యం ఏంటనే దాని పైన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. కొత్త రాజకీయ శక్తి అవసరమని కేసీఆర్ తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో ఉజ్వల పాత్ర పోషిస్తామని ప్రకటించారు. ఎవరినో గద్దె దించటానికో ఎక్కించటానికో కాదు. గద్దెను ఎక్కించాల్సింది ప్రజలని కేసీఆర్ తేల్చి చెప్పారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదు. ప్రజల జీవన స్థితిగతులని స్పష్టం చేసారు.