More

    తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన

    జాతీయ రాజకీయాల్లో భాగం కావాలని అనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతూ ఉన్నారు. జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారని సిఎంఓ ట్వీట్ లో తెలిపింది.

    దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆయన ఈ పర్యటనలో ఆదుకోనున్నారు. రైతుల హక్కుల కోసం ఉద్యమంలో పోరాడి అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సీఎం పరామర్శించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తారు. మే 22వ తేదీన మధ్యాహ్నం సీఎం ఢిల్లీ నుంచి చంఢీఘర్ పర్యటన చేపడతారు. జాతీయ రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం శ్రీ కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ లతో కలిసి కేసీఆర్ చేపడతారు. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను అందచేస్తారు. 26 మే ఉదయం సీఎంకేసీఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు. బెంగుళూరు నుంచి మే 27 తేదీన రాలేగావ్ సిద్ధి పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. మే 29 లేదా 30న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం సీఆర్ వెళ్లనున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు.

    Trending Stories

    Related Stories