ఛత్తీస్ గఢ్ లో ముఖ్యమంత్రి తండ్రిని అరెస్టు చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గంపై వ్యాఖ్యలు చేసిన సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ బాఘేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను రాయ్ పూర్ కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దాంతో పోలీసులు జైలుకు తరలించారు. నందకుమార్ బాఘేల్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “బ్రాహ్మణులను విదేశీయులని అన్నారు. బ్రాహ్మణులను గంగా నది నుంచి వోల్గా నదికి పంపించి వేయాలి. వారు మన దేశానికి చెందినవారు కాదు. వారు మనల్ని అంటరానివారుగా చూస్తుంటారు. మన హక్కులన్నీ లాగేసుకున్నారు. అందుకే బ్రాహ్మణులను ఎవరూ గ్రామాల్లోకి రానివ్వరాదు. వారిని బహిష్కరించాలి” అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. నంద్ కుమార్ బాఘేల్ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలపై సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు రాయ్పూర్లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులను విదేశీయులు అని.. వారిని బహిష్కరించాలని నంద్ కుమార్ బాఘేల్ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారని, వారిని తమ గ్రామాలలోకి అనుమతించవద్దని ప్రజలను కోరినట్లు సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సంస్థ తన ఫిర్యాదులో తెలిపింది. రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్ కుమార్ బాఘేల్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని పోలీసులకు తెలిపింది. ఆయనపై చర్చలు తీసుకోవాలని కోరింది. దాంతో ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(B) కింద కేసు నమోదు చేసినట్లు రాయ్పూర్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అతని అరెస్టుకు సంబంధించిన వార్తలు వెలువడిన వెంటనే పోలీస్ స్టేషన్లోని ఎయిర్ కండిషన్డ్ ఛాంబర్లో భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ప్రారంభించింది. ఆయనకు పోలీసు స్టేషన్ లో ఫైవ్ స్టార్ సదుపాయాలను అందించారని విమర్శలు వస్తున్నాయి. భూపేష్ బాఘేల్ తన తండ్రిని అరెస్టు చేయించి కాంగ్రెస్ పార్టీ నైతికతను హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. బ్రాహ్మణ ఓటు బ్యాంకును వాడుకోడానికే తన తండ్రి అరెస్టును చేయవచ్చని చెప్పారని నెటిజన్లు విమర్శించారు. “ప్రజా శాంతికి భంగం కలిగించే తప్పులకు అతన్ని తన తండ్రిని కూడా క్షమించను” అని భూపేష్ బాఘేల్ అంతకు ముందు చెప్పుకొచ్చారు. అయితే, తన తండ్రి అరెస్టు అయ్యాక.. ఆయన్ను సామాన్యుడిగా మాత్రం పరిగణించలేదు.