టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన వైసీపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అలీకి రాజ్యసభ సభ్యత్వం అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల వైసీపీకి అలీ గుడ్బై చెప్పబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. వైఎస్సార్సీప్లో ఉన్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న అలీ జనసేనవైపు చూస్తున్నారని వార్తలు వచ్చాయి. అలీ జనసేనలో చేరితే తూర్పు లేదా పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పోటీలో ఉండే ఛాన్స్ ఉందని కథనాలను అల్లేశారు.
ఈ వార్తలపై అలీ తాజాగా స్పందించారు. తాను వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అలీ తేల్చి చెప్పారు. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. వైసీపీలో తాను చేరింది పదవుల కోసం కాదని.. జగన్ ను సీఎం చేయాలనే లక్ష్యంతోనే తాను వైసీపీలో చేరానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానమే తనకు ముఖ్యమని ఆయన అన్నారు.
మొదట అలీ వైసీపీలో చేరినప్పుడు రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక రాజ్యసభకు పంపడం ఖాయమని ప్రచారం జరిగింది.