ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ నిబంధనల్లో మార్పులు.. సినిమా థియేటర్లు కూడా ఓపెన్

0
720

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుతూ ఉండడంతో ఏపీ సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇస్తూ వస్తోంది. తాజాగా కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆ రెండు జిల్లాల్లోనూ సడలింపు సమయాలు మార్చుతున్నట్టు ప్రకటించింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఉద‌యం 6 నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ స‌డ‌లించారు. సాయంత్రం 6 గంట‌ల‌కే దుకాణాలు మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగ‌తా జిల్లాల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపులు ఇచ్చారు. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌ వ‌చ్చేంత‌ వ‌ర‌కు ఆంక్ష‌ల కొన‌సాగింపు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా థియేట‌ర్లు, జిమ్‌లు, ఫంక్ష‌న్ హాళ్ల‌ను తెరిచేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుందని ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు, జిమ్ లు, కల్యాణ మండపాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ సీట్ల మధ్య ఖాళీలతో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ సడలింపులు జులై 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here