తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న చిత్ర బృందానికి అక్కడ నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 20న మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్ రాజు, సురేశ్బాబు తదితరులు జగన్ను కలవనున్నారు. కరోనా కష్టకాలంలో తెలుగు చిత్రపరిశ్ర ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువస్తామని చిరంజీవి నేతృత్వంలోని బృందం ఇంతకుముందు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ద్వారా కబురుపంపింది. ఆయన ఈ విషయం ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. ఈ నెల 20న చిత్రప్రముఖులను ఆహ్వానించమని మంత్రి పేర్ని వెంకట్రామయ్యకు సీఎం చెప్పారు. ఈ సమాచారం చిరంజీవికి మంత్రి పేర్ని చేరవేశారు.
దీంతో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 20న కలవనున్నారు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు. కరోనా నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పలు సమస్యలు ఎదుర్కొంటోందని, ముఖ్యమంత్రిని కలిసి వీటిని తెలియజేయాలని అనుకుంటూ ఉన్నారు. పేర్ని నాని నుంచి సమాచారం అందడంతో 20న జగన్ను కలిసేందుకు చిరంజీవి సారథ్యంలోని బృందం రెడీ అవుతోంది. జగన్ దృష్టికి తీసుకెళ్లనున్న అంశాలపై చిత్రపరిశ్రమ ప్రముఖులు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. వీటిలో కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు వేసే అవకాశం కోరడం, నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించడంతోపాటు గ్రేడ్-2 కేంద్రాల్లో నేల టికెట్టుకు పది రూపాయలు, కుర్చీకి రూ.20 వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని కోరడం వంటివి ఉన్నాయి. సినిమా టికెట్లను ఇకపై ప్రభుత్వమే విక్రయించాలని నిర్ణయించడంపైనా చిరంజీవి బృందం ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో చూడాలి.