More

    భారత్ కు డ్రాగన్ మద్దతు.. మతలబ్ క్యాహై..?

    డ్రాగన్ దేశానికి భారత్ సత్తా తెలిసి వచ్చిందా..? ఇండియాను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చైనా మరోసారి భారత్‌కు మద్దతుగా గొంతు విప్పింది.

    గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాలను నిందించడం వల్ల ప్రపంచ ఆహార సంక్షోభానికి పరిష్కారం లభించదని అభిప్రాయపడింది. ఈ మేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్, భారత్‌కు మద్దతుగా ఒక ఎడిటోరియల్‌ ప్రచురించింది. గోధుమ ఎగుమతులను నిషేధించవద్దని జీ 7 వ్యవసాయ మంత్రులు భారతదేశాన్ని కోరారు. అయితే జీ 7 దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ముందుకు రావడం లేదని జీటీ సందపాదకీయం ప్రశ్నించింది. భారత్‌ ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు అయినప్పటికీ, ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో ఒక చిన్న భాగమే అని తెలిపింది.

    మరోవైపు అమెరికా, కెనడా, ఈయూ, ఆస్ట్రేలియా వంటి కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు గోధుమ ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్న సంగతిని చైనా గుర్తు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం నెలకొన్న తరుణంలో పశ్చిమ దేశాలు గోధుమ ఎగుమతిని బాగా తగ్గించడాన్ని విమర్శించింది. ఈ నేపథ్యంలో సొంత ఆహార భద్రతపై నెలకొన్న ఒత్తిడిలో భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని జీ 7 దేశాలు విమర్శించడం తగదన్నది. దీనికి బదులుగా ప్రపంచ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలను జీ 7 దేశాలు స్వాగతించాలని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సూచించింది.

    Trending Stories

    Related Stories