More

    ఐపీఎల్ ఫైనల్ కు చేరుకున్న చెన్నై

    గత ఏడాది ఐపీఎల్ లో లీగ్ దశలోనే ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఏడాది అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ కు దూసుకువెళ్ళింది. మూడుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై తాజాగా తొమ్మిదోసారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ఢిల్లీని ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మూడు పరుగుల వద్దే డుప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకుంది. రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్ రాణించారు. ధోనీ 6 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

    గైక్వాడ్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, ఉతప్ప 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో హై డ్రామా నడిచింది. చెన్నై విజయానికి 13 పరుగులు అవసరమైన వేళ మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. దీనికితోడు ఓవర్ తొలి బంతికే మొయిన్ అలీ (16) వికెట్ కోల్పోయింది. ధోనీ ఫోర్లతో మ్యాచ్ ను ముగించాడు. ఫలితంగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించి ఫైనల్‌కు చేర్చాడు.

    తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ఓపెనర్ పృథ్వీషా, కెప్టెన్ పంత్‌, హెట్‌మెయిర్ రాణించారు. పృథ్వీషా 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేయగా, పంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా నిలిచి 51 పరుగులు చేశాడు. హెట్‌మెయిర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. 70 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు బెంగళూరు రాయల్ చాలెంజర్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఢిల్లీ కేపిటల్స్ తో క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది.

    Trending Stories

    Related Stories