తమిళనాడు బీజేపీ నేత బాలచంద్రన్ దారుణ హత్యకు గురయ్యారు. బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు హత్య చేసి పరారయ్యారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ టీ బ్రేక్ తీసుకున్న సమయంలో క్షణాల వ్యవధిలో దాడికి పాల్పడ్డారు.
పాత కక్షలే కారణమనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాణహాని ఉందని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం బాలచంద్రన్ కు ఇదివరకే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ నియమించింది. అయినా ప్రయోజనం దక్కలేదు. తమిళనాడు బీజేపీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఎస్ సీ, ఎస్ టీ వింగ్ చైర్మన్ గా బాలచంద్రన్ పనిచేస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్టు చెన్నై కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్ జివాల్ ప్రకటించారు. కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా ఈ హత్యను తమిళనాడు విపక్ష నేత, ఏఐడీఎంకే పార్టీకి చెందిన ఈకే పళనిస్వామి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర పోలీసుల ఘోరవైఫల్యంగా ఆయన అభివర్ణించారు. చెన్నై నగరంలో కేవలం 20 రోజుల వ్యవధిలో ఈ తరహా 18 హత్యలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యలు చెన్నై నగరాన్ని హత్యల నగరంగా మార్చివేస్తున్నాయని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.