చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్యపై పరిమితి ఎత్తివేత

0
711

చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై పరిమితిని ఎత్తివేయాలని కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం బద్రీనాథ్‌కు రోజుకు 1000 మంది, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఇప్పటికే ప్రారంభమైన యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, కాబట్టి భక్తుల సంఖ్యపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం అభ్యర్థించింది. స్పందించిన కోర్టు పరిమితులను ఎత్తివేస్తూ తీర్పును ఇచ్చింది. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్‌ధామ్ యాత్రకు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. యాత్రికుల సంఖ్య విషయంలో వున్న పరిమితులను ఎత్తివేసింది. దర్శనం కోసం తప్పనిసరిగా చార్‌ధామ్ బోర్డు పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఇకపై పోర్టల్ నుంచి యాత్ర ఈ-పాస్ అవసరం లేదని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పూర్తయినట్టు ధ్రువపత్రం కానీ, లేదంటే యాత్రకు ముందు చేయించుకున్న కొవిడ్ పరీక్ష నెగటివ్ రిపోర్టు కానీ యాత్రికులు అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.

అంతకుముందు సెప్టెంబర్ 16 న, కోర్టు చార్ ధామ్ యాత్రకు అనుమతి ఇచ్చింది కానీ పలు ఆంక్షలు విధించింది: 1,000 మంది యాత్రికులు బద్రీనాథ్, 800 కేదార్‌నాథ్, 600 గంగోత్రి మరియు 600 యమునోత్రి వద్దకు అనుమతించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ మరియు జస్టిస్ అలోక్ కుమార్ వర్మలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ‘దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అందుచేత ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రికులు చార్ ధామ్‌ని సందర్శించడానికి ఉన్న గరిష్ట పరిమితిని తీసివేయడం మంచిదని నిర్ణయించాము’ అని ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే కరోనా నియమాలని పాటించేలా చర్యలు మాత్రం తప్పనిసరిగా పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది ధర్మాసనం.