టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు.. నా చివరి ఎన్నిక అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. గౌరవ సభ కాదని, అది కౌరవ సభ అని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ అసెంబ్లీలో నన్ను, నా భార్యను కూడా అవమానించారని.. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే అని, లేదంటే ఇదే తన చివరి ఎన్నిక అని చెప్పారు. తనను గెలిపిస్తే ఈ కౌరవ సభను మళ్లీ గౌరవ సభ చేస్తా అని చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తాననే అసత్య ప్రచారం కొందరు చేస్తున్నారని.. అవన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఆపబోనని.. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గాన తీసుకెళతానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అవినీతికి, అక్రమాలకు ప్రతిరూపం సీఎం జగన్ అని.. కోడుమూరు నియోజకవర్గంలో మట్టి దోపిడీ, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మీద గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం జగన్.. మూడు రాజధానులు కడతాడా? అంటూ విమర్శించారు. రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోంది… ఈ గాలిలో వైసీపీ కొట్టుకు పోవడం ఖాయమని అన్నారు.