కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో గుబ్బల దేవిక అనే డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఓ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్, నిందితుడిపై దిశం చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ సీఎం జగన్ మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు. యువతి కుటుంబాన్ని పరామర్శించాలని అధికారులను ఆదేశించారు. వారికి అండగా నిలవాలని సూచించారు. దేవిక తల్లిదండ్రులు నాగమణి, రాంబాబు హైదరాబాదులో ఉంటుండగా, దేవిక కూరాడ గ్రామంలో తన అమ్మమ్మ చంద్రమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఆమెను హత్య చేసిన వెంకట సూర్యనారాయణ కూడా కూరాడ గ్రామానికి చెందినవాడే. దేవిక, సూర్యనారాయణ ప్రేమించుకోగా, తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని దేవిక పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో ఆమెపై కోపం పెంచుకున్న సూర్యనారాయణ నడిరోడ్డుపై హత్య చేశాడు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రకటనలకే పరిమితం అవుతోందని విమర్శించారు. కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సీఎం ప్రకటనలు చేయడం మోసగించడమేనని స్పష్టం చేశారు. సీఎం, ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని, అప్పుడే నేరస్తులకు భయం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. కొత్త చట్టాలు కాదు… కనీసం ఉన్న చట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసుపెట్టిన వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని చంద్రబాబు విమర్శించారు.