భారతీయ జనతా పార్టీ బీజేపీ నేడు మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సభలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి బీజేపీలో చేరనున్నారు.
అమిత్ షా పర్యటన వివరాలు:
ఢిల్లీ నుంచి బయలుదేరనున్న అమిత్ షా మద్యాహ్నం 3.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బయలుదేరనున్న ఆయన సాయంత్రం 4.30 గంటలకు మునుగోడు చేరుకుంటారు. అక్కడే సీఆర్పీఎఫ్ అధికారులతో ఆయన భేటీ అవుతారు. అనంతరం మునుగోడులో బీజేపీకి చెందిన ఓ దళిత కార్యకర్త ఇంటిలో ఆయన భోజనం చేయనున్నారు. అక్కడే రైతులతో మాట్లాడనున్న అమిత్ షా మునుగోడు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత తిరిగి రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ చేరుకోనున్నారు. ఓ గంటన్నర పాటు నోవాటెల్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ పలువురు తెలంగాణ బీజేపీ నేతలను కలవనున్నారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు.