అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్పల్లి మాజీ సీఐ కె.నాగేశ్వరరావు తన నేరాన్ని అంగీకరించాడు. తన వద్ద పనిచేసే కాపలాదారు భార్యను అత్యాచారం చేశానని, విషయం బయటపెడితే చంపేస్తానని తుపాకితో బెదిరించానని అంగీకరించాడు. అధికారుల దర్యాప్తులో నాగేశ్వరరావు నేరం ఒప్పుకున్నాడు. దీంతో హత్యాయత్నం, అత్యాచారం, బెదిరింపులతో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీఐ సర్వీస్ రివాల్వర్, దుస్తులు సేకరించారు. బాధితురాలి ఇంటి దగ్గరలోని ఎలక్ట్రికల్ షాప్లో సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. లైంగికదాడి ఆనవాళ్లను చెరిపేసేందుకు తన దుస్తులను తానే ఉతుక్కున్నట్టు ఒప్పుకున్నాడు. వనస్థలిపురం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను పేర్కొన్నారు.
పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. నాగేశ్వరరావు ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు. నాలుగేళ్ల క్రితం బాధితురాలి భర్తపై క్రెడిట్ కార్డుల మోసానికి సంబంధించి బేగంపేట, మహంకాళి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడిని అరెస్ట్ చేసిన నాగేశ్వరరావు జైలుకు పంపాడు. ఆ సమయంలో టాస్క్ఫోర్స్ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు పుట్టగొడుగుల పెంపకంలో భారీగా నష్టాలు వచ్చాయని నాగేశ్వరరావు వద్ద చెప్పుకుంది. వెలిమేడులో తనకున్న ఫామ్హౌస్లో పుట్టగొడులు పెంచాలని, కాపలాదారుగా ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఆమె భర్త బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత తన ఫామ్హౌస్లో నియమించుకున్నాడు. తరచూ ఫామ్హౌస్కు వెళ్లి బాధితురాలితో మాట్లాడేవాడు. గతేడాది ఫిబ్రవరిలో బాధితురాలిని కారులో ఎక్కించుకుని ఫామ్హౌస్కు సమీపంలోని మాదాపురం గ్రామంలో స్నేహితురాలి ఇంటి వద్ద దింపాడు. అతడి ఉద్దేశ్యం గమనించిన ఆమె తన భర్తకు ఫోన్ చేసి చెప్పడంతో అతడు తీవ్రంగా స్పందించాడు. నాగేశ్వరరావుకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించాడు. దీంతో నాగేశ్వరరావు క్షమించమని ఆమె భర్తను వేడుకున్నాడు. బెదిరించిన ఆమె భర్తపై నాగేశ్వరరావు కోపం పెంచుకున్నాడు. ఈ నెల 7న బాధితురాలి భర్త ఊళ్లో లేడన్న విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్పొద్దంటూ తుపాకి గురిపెట్టి బెదిరించాడు. అదే సమయంలో ఆమె భర్త రావడంతో ఇద్దరినీ తుపాకితో బెదిరించి కారు ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. దీంతో బాధితులిద్దరూ తప్పించుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొత్తపేటలోని ఇంటికి వెళ్లి ఆధారాలు లభించకుండా దుస్తులను స్వయంగా ఉతుక్కున్నాడు. ఆ తర్వాత పోలీసుల కేసు భయంతో బెంగళూరు పారిపోయాడు నాగేశ్వరరావు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.