దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలో మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్లోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయడంతోపాటు వెబ్కాస్టింగ్ కూడా చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలులో రికార్డు స్థాయిలో 77.64 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్ స్టేషన్లలో 2,37,022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఈటల, అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాసయాదవ్ బరిలో ఉండగా, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు)ను కాంగ్రెస్ బరిలోకి దింపింది.
ఇక అసోంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు, బెంగాల్లో నాలుగు, మధ్యప్రదేశ్, మేఘాలయ, హిమాచల్ప్రదేశ్లో మూడు చొప్పున, బీహార్, కర్ణాటక, రాజస్థాన్లో రెండు చొప్పున, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ జరగుతోంది. దాద్రానగర్ హవేలీ, హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం, మధ్యప్రదేశ్లోని ఖాండ్వా లోక్సభ స్థానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు.