భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నర్సయ్యగౌడ్ కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రులు భూపేంద్రయాదవ్, కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, తదితరుల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బూర నర్సయ్యతో పాటు మరికొందరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు.
రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయడమే తన ప్రధాన కర్తవ్యమని ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులను తెలంగాణకు, ప్రత్యేకంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చానని చెప్పారు. సబ్ కా సాత్… సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ స్ఫూర్తితో పనిచేస్తానన్నారు. తెలంగాణ, దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన అన్నారు.