మీడియా మీద చర్యలు తీసుకోవాలన్న శిల్పా శెట్టి.. బాంబే హైకోర్టు ఏమి చెప్పిందంటే..!

0
740

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే..! ఆయన అరెస్టు గురించి పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. శిల్పా శెట్టిని అధికారులు విచారించినప్పుడు చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన సమాచారం కూడా మీడియాలో వచ్చింది. కొన్ని మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచారం చేశాయంటూ ముంబై హైకోర్టులో శిల్పా పిటిషన్‌ దాఖలు చేసింది. తన భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా కేసులో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారని పిటిషన్‌లో తెలిపింది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలతో పాటు, పలువురు జర్నలిస్టులపై పరువునష్టం దావా వేసింది. మీడియా కథనాల ద్వారా తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లిందని, కాబట్టి రూ. 25 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని, తన పరువుకు భంగం కలిగేలా యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్‌లో వచ్చిన కథనాలను తొలగించేలా ఆదేశించాలంటూ వేసిన శిల్ప పిటిషన్‌ను బాంబే హై కోర్టు విచారించింది.

జస్టిస్ గౌతమ్ పటేల్ మాట్లాడుతూ.. జర్నలిజంలో మంచి, చెడు నిర్ణయించడంలో న్యాయస్థానాలది పరిమిత పాత్ర అని.. శిల్పాశెట్టికి వ్యతిరేకంగా ప్రసారమైన మీడియా కథనాలలో ఆమె పరువుకు భంగం కలిగించే అంశాలేవీ లేవని అన్నారు. అవన్నీ పోలీసుల కథనాల ఆధారంగానే ఉన్నాయని.. శిల్పాశెట్టి ఏడ్చిందని, భర్తతో గొడవపడిందని మాత్రమే వాటిలో ఉందన్నారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాలుగు గోడల మధ్య ఈ ఘటన జరిగితే అది వేరే విషయం కానీ, బయటి వ్యక్తుల మధ్య జరిగిన విషయాలనే ఆ కథనాల్లో ప్రస్తావించారని, ఇదెలా పరువునష్టం అవుతుందని జస్టిస్ గౌతమ్ పటేల్ ప్రశ్నించారు. శిల్పాపై కథనాలు మానవీయ కోణంలోనే ఉన్నాయని, ఈ కథనాల్లో ఎలాంటి తప్పు కనిపించడం లేదన్నారు. ప్రజా దృష్టిలో ఉండే జీవితాన్ని ఎంచుకున్నప్పుడు ఇలాంటివి అందులో భాగం అవుతాయని, మీ జీవితం మైక్రోస్కోప్ కిందే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని జస్టిస్ పటేల్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌ను కూడా నియంత్రించాలని కోరడం ప్రమాదకరమని పేర్కొంది. నిజానిజాలను నిర్ధారించుకోకుండా ద్వేషపూరిత కంటెంట్ తో అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించాలంటూ మూడు యూట్యూబ్ చానళ్లను కోర్టు ఆదేశించింది.

అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నట్టుగా అతడి మీద ఆరోపణలు వచ్చాయి. పోలీసులు రాజ్‌కుంద్రాను జులై 19న అదుపులోకి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here