శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో బాయిలర్ పేలింది. మంగళవారం నాడు దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ తయారీకి ఉపయోగించే వంటగదిలోని స్టీమ్ వాటర్ బాయిలర్ పేలడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఆలయ సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. నిత్య అన్నదానం బయటవైపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న వారికి వేడి పాలు, ప్రసాదం అందించారు. ఈ ఏర్పాట్లకు ఉపయోగించే వంటగదిలోనే మంగళవారం ఉదయం పేలుడు చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో పేలుడు చోటుచేసుకోవడంతో సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు.